కామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతల అరెస్ట్
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:43 AM
ఇసుక పూడికతీత పాయింట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన పలువురు వైసీపీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు
పెళ్లకూరు/తడ, మార్చి 15(ఆంధ్యజ్యోతి): పెళ్లకూరు మండలం కలవకూరు స్వర్ణముఖినదిలో ఏర్పాటు చేసిన ఇసుక పూడికతీత పాయింట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన పలువురు వైసీపీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్టీసీసీబీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా, సురే్షరెడి,్డ నారాయణరెడ్డి, సురేంద్రరెడ్డి, నాగరాజు, గోపాల్, శ్రీనివాసులుతో పాటు మరికొంతమంది కలవకూరు స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన ఇసుక పూడికతీత పాయింట్ వద్దకు శనివారం వెళ్లారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అక్కడ సిబ్బందిని అడ్డుకుని దాడులకు పాల్పడారు. అక్కడున్న ల్యాప్ట్యాప్, ఫోన్లను ధ్వంసం చేశారు. దీంతో రీచ్ యజమాని మల్లిఖార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవయ్య, సత్యనారాయణరెడ్డి, శేఖర్రెడ్డి, ప్రిస్కిల్లాతో పాటు మరికొంతమందిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సొమవారం హైదరాబాద్ నుంచి వస్తున్న సత్యనారాయణ రెడ్డిని రేణిగుంటలోని ఎయిర్పోర్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీకాళహస్తిలో శేఖర్ రెడ్డిని, నెలబల్లి, పసుపుకండ్రిగ, కలవకూరు ప్రాంతాలకు చెందిన సురే్షరెడి,్డ నారాయణరెడ్డి, సురేంద్ర రెడ్డి, నాగరాజు, గోపాల్, శ్రీనివాసులును అరెస్ట్ చేసి దొరవారిసత్రం స్టేషన్కు తరలించారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం నాయుడుపేట కోర్టుకు హాజరు పరిచారు. జడ్జి వారికి 14రోజులపాటు రిమాండు విధించారు.దీంతో వారందరిని నెల్లూరు జైలుకు తరలించారు.అంతకుముందు వైసీపీ నాయకులను అరెస్టు చేశారంటూ వార్తలు వెలువడడంతో పలువురు పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజీవయ్యను కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పెళ్లకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారని, అతనిని మాత్రం జడ్జి ముందు హాజరుపరచకపోవడం చర్చనీయాంశమైంది.