ఆవుకు ‘సీమంతం’
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:30 AM
పాడి ఆవుపై ఉన్న మమకారంతో ఓ రైతు దానికి శాస్త్రోక్తంగా సీమంతం నిర్వహించారు. ఆవుపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు యాదమరి మండలంలోని కె.గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాములు మందడి.
యాదమరి, ఆంధ్రజ్యోతి: పాడి ఆవుపై ఉన్న మమకారంతో ఓ రైతు దానికి శాస్త్రోక్తంగా సీమంతం నిర్వహించారు. ఆవుపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు యాదమరి మండలంలోని కె.గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాములు మందడి. ఈయన కొంతకాలంగా అరుదైన పుంగనూరు జాతి పశువులను పెంచుతున్నారు. ఆయన వద్ద ఉన్న ఒక పుంగనూరు జాతి ఆవు ప్రస్తుతం చూలుతో ఉండడంతో దానికి గ్రామస్థుల సమక్షంలో శుక్రవారం ఘనంగా సీమంతం నిర్వహించారు. ఆవుకు పసుపు, కుంకుమను పూసి మంగళహారతులిచ్చి, పండ్లు పిండివంటలను నైవేద్యం సమర్పించి గ్రామస్థులందరూ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవును ఆశీర్వదించారు. ‘మన రాష్ట్ర గర్వకారణమైన, అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా మన సంప్రదాయాలను, స్వదేశీ జాతులను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించా’నని శ్రీరాములు తెలిపారు.