కుప్పం రోడ్డు విస్తరణకు రూ.7.41 కోట్లు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:03 AM
కుప్పం పట్టణంలోని నేతాజీ రోడ్డు విస్తరణ పనులకు రూ.7.41 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
కుప్పం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కుప్పం పట్టణంలోని నేతాజీ రోడ్డు విస్తరణ పనులకు రూ.7.41 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్డు విస్తరణకు అవసరమైన భూ సేకరణకోసం మొత్తం రూ.7,41,08,600 మంజూరు చేస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19లో టీడీపీ హయాంలో నేతాజీ రోడ్డు విస్తరణ పనులను చేపట్టి మొదటి రీచ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో భవనాలు కోల్పోవాల్సి వచ్చిన కొంతమంది బాధితులు కోర్టు మెట్లు తొక్కడంతో విస్తరణ పనులు ఆగిపోయాయి. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పూర్తిగా మూలనపడింది. తిరిగి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, నేతాజీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్న ప్రయత్నాలు కడా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. విస్తరణకోసం స్థల సేకరణకు నిధులు లేకపోవడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఇప్పుడు నిధులు మంజూరు కావవడంతో మళ్లీ రోడ్డు విస్తరణ పనులు ఊపందుకోనున్నాయి.