రూ.10 లక్షల రుణానికి రూ.2100
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:25 AM
జీడీనెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్న యుగంధర్ రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఇటీవల బాధితులు ఎస్పీ తుషార్డూడీకి ఫిర్యాదు చేశారు.
150 మంది నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు
జనసేన నేతపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
చిత్తూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్న యుగంధర్ రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఇటీవల బాధితులు ఎస్పీ తుషార్డూడీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పేదలకు పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఒకొక్కరి నుంచి రూ.2100 చొప్పున వసూలు చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 150 మంది నుంచి వసూలు చేసినట్లు చెబుతున్నారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. కాగా, ఈయన వసూలు చేసినవారిలో అత్యధికులు జనసేన కార్యకర్తలే ఉన్నట్లు తెలిసింది. అయితే, అమరావతిలోని సచివాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోనులో సంప్రదించడంతో ఈ వసూళ్లు చేసి.. పాలంకి లక్ష్మణ్ అనే వ్యక్తికి రూ.2.97 లక్షలు ఫోనుపే చేసి.. తానూ మోసపోయానని ఇటీవల ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లో కార్వేటీనగరం సీఐ హనుమంతప్పకి జూలై 26న యుగంధర్ ఫిర్యాదు చేసిన విషయం గురువారం బయటకు వచ్చింది.