Share News

టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:50 AM

రాయలసీమ అభివృద్ధి టీడీపీ వల్లనే సాధ్యమవుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.

టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి
ప్రసాద్‌బాబు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న రాజంపేట పార్లమెంటు టీడీపీ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు

మదనపల్లె, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాయలసీమ అభివృద్ధి టీడీపీ వల్లనే సాధ్యమవుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లెలో సోమవారం జరిగిన టీడీపీ రాజంపేట పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు సీఎం దృష్టిలో ఉన్నాయని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక సంస్థల్లో కష్టపడి పనిచేస్తే, 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మనదే అవుతుందని సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషిస్తానని ప్రకటించారు. పీలేరు ఎమ్మెల్యే ఎన్‌.కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. టీడీపీ రాజంపేట ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్‌రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌.శ్రీనివాసులురెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామ్‌చినబాబు, పుంగనూరు, రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జులు చల్లా రామచంద్రారెడ్డి, ముక్కా రూపానందరెడ్డి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ ప్రసంగించారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌తోపాటు కమిటీ సభ్యుల చేత చమర్తి జగన్మోహన్‌రాజు ప్రమాణస్వీకారం చేయించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:50 AM