Share News

పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:45 AM

గ్రామ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. పది రోజుల క్రితం జిల్లాలో ప్రారంభమైన

పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు
మదనపల్లెలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం

28ఎంపీఎల్‌ టీ1:

ముమ్మరంగా ఓటర్ల జాబితా ప్రక్రియ

నేటి నుంచి అభ్యంతరాలపై విచారణ

3న గ్రామసభలు

7న తుది ఓటరు(బీసీ, ఎస్సీ, ఎస్టీ) జాబితా ప్రకటన

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): గ్రామ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. పది రోజుల క్రితం జిల్లాలో ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే ప్రక్రియ సెప్టెంబరు 7వ తేదీన ముగియనుంది. ఆ రోజున ప్రకటించే ఓటరు జాబితాను అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.

నేటి నుంచి అభ్యంతరాలపై విచారణ

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 9,09,605 మంది ఓటర్లు ఉండగా అందులో ఎస్సీ 1,14,121, ఎస్టీ 29,458, బీసీ 4,92,695, జనరల్‌ 2,73,337 ఉన్నారు. 411 గ్రామ పంచాయతీలు, 4,228 వార్డులు, 4,304 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను సర్వే పూర్తి చేశారు. 25వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించారు. అనంతరం మూడు రోజులు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. శనివారం నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు అభ్యంతరాలపై విచారణ, సవరణలు(ఎస్సీ, ఎస్టీ, బీసీ) పూర్తి చేస్తారు. మూడు నుంచి 6వ తేదీ వరకు 411 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ఓటర్లకు వివరిస్తారు. 7వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవుల కోసం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు కానున్నట్లు అధికార వర్గాల భోగట్టా. గత ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్లను అనుసరించి, ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ఎక్కువ ఎవరు ఉంటే ఆయా గ్రామాల సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్‌ ఖరారు చేస్తారు. అలాగే 2026 జనవరి జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్‌ ఇప్పటివరకు రాలేదు.

కులాల అభ్యంతరాలుంటే తెలుపుకోవచ్చు

కులాంతర వివాహం చేసుకున్న వారు, భార్యాభార్తల కులాలు వేరైనప్పుడు ఓటరు జాబితాలో వారి కులాన్ని సర్టిఫికెట్‌ ఆధారంగా మార్చుకోవచ్చు. ఇటీవల తహసీల్దార్‌ నుంచి పొందిన కుల సర్టిఫికెట్లు సమర్పిస్తే వాటి ఆధారంగా ఓటరు జాబితాలో కులం నమోదు చేస్తాం.

- ఎ.రాధమ్మ, డీపీవో

Updated Date - Aug 29 , 2026 | 12:45 AM