క్వాలిటీ రిజల్ట్ కావాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:58 AM
టెన్త్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు తావుండకూడదు అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం
తిరుపతి(విద్య), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి):టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడమే లక్ష్యం కాదని, నైపుణ్యంతో కూడిన విద్యతో విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం విద్యా వ్యవస్థ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్, ఓపెన్ హైస్కూల్, ఓపెన్ ఇంటర్ పరీక్షల సంన్నద్దతపై ఓరియంటేషన్ కార్యక్రమం కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ... పరీక్షల్లో నాణ్యమైన ఫలితాలే లక్ష్యంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులకు సూచించారు.ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.డీఈవో కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరంలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించి ప్రత్యేక బోధన అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 179 పరీక్ష కేంద్రాల్లో 33 వేలమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త గౌరీ శంకర్రావు, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి భరత్, టైబ్రల్ వెల్ఫేర్ అధికారి సోము రాజు, డివిజనల్ విద్యాశాఖాధికారులు ఇందిరాదేవి, సనత్ కుమార్, మహేశ్వరయ్య, జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సుధ, మండల విద్యాశాఖాధికారులు బాలాజీ తదితర ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.