అమ్మవారి సేవలో మారిషస్ అధ్యక్షుడు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:44 AM
పద్మావతి అమ్మవారిని మంగళవారం సాయంత్రం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు.
తిరుచానూరు/రేణిగుంట/తిరుమల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మంగళవారం సాయంత్రం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీవో భానుప్రకా్షరెడ్డి, ఇన్చార్జి ఎయిర్పోర్టు డైరెక్టర్ భూమినాదన్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుచానూరులోని అమ్మవారిని దర్శించుకున్నాక ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అమ్మవారి ఊంజల్సేవలోనూ పాల్గొన్నారు. అనంతరం తిరుమల వెళ్లిన ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని.. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠాన్ని సందర్శించాక ధరమ్ బీర్ గోకుల్ దంపతులు తిరుగు ప్రయాణంకానున్నారు.