స్వాతంత్య్ర దినోత్సవానికి జోరుగా ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:16 AM
స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా వేడుకలకు వేదికైన తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా దేవదాయశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరు కానున్నారు.
తిరుపతి(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా వేడుకలకు వేదికైన తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా దేవదాయశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరు కానున్నారు. మైదానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వీక్షకులు, విద్యార్థులు కూర్చోవడానికి ఏర్పాట్లు ముమ్మరంచేశారు. ప్రత్యేక స్టాల్స్కు జర్మన్షెడ్లు వేశారు. ప్రధాన వేదికను కూడా సిద్ధంచేశారు. ఇక ఏటా జిల్లాలోని వివిధశాఖల్లో అధికారులు, సిబ్బందికి సుమారు 500మందికి పైగా ప్రశంసాపత్రాలు అందించేవారు. ఈదఫా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిశాఖలో విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఈఏడాది 156మందే ప్రశంసాపత్రాలు అందుకోనున్నారు. వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు కుటుంబసభ్యులను కూడా సన్మానించనున్నారు.
11 శకటాలు, 9 స్టాల్స్
వివిధ ప్రభుత్వ శాఖల్లో సాధించిన ప్రగతి, అభివృద్ధి ప్రతిబింబించేలా 11 శకటాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం ఒక శకటంగా.. పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించి మరో శకటం, ఎస్పీడీసీఎల్, పోలీసు, వైద్య ఆరోగ్యం, మున్సిపల్ కార్పొరేషన్, తుడా, సూపర్సిక్స్, విద్య, అగ్నిమాపకంతోపాటు సరికొత్తగా వీబీజీ రామ్జీ ఇలా.. మొత్తం 11 శకటాలను ప్రదర్శించనున్నారు. అలాగే పశుసంవర్థకం, మత్స్య, అటవీ, చేనేత, శిశు సంక్షేమం, సెరికల్చర్, పోలీసు, డీఆర్డీఏ, మెప్మా, ఎస్పీడీసీఎల్కు చెందిన 9స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమణ, రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు, ఎన్సీసీ కేడెట్లు రిహార్సల్స్ నిర్వహించారు.