పంట పొలాల్లో గజరాజుల బీభత్సం
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:34 AM
అటవీ సరిహద్దు గ్రామాల పంట పొలాలపై ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కేవీపల్లె మండలం జిల్లెలమంద పంచాయతీ పెద్దతండా, బసన్నగారిపల్లె పరిసర గ్రామాల పరిధిలోని పంటలపై ఏనుగులు దాడి చేశాయి.
మామిడి, కొబ్బరి చెట్లు, ఇనుక కంచె ధ్వంసం
పీలేరు రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అటవీ సరిహద్దు గ్రామాల పంట పొలాలపై ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కేవీపల్లె మండలం జిల్లెలమంద పంచాయతీ పెద్దతండా, బసన్నగారిపల్లె పరిసర గ్రామాల పరిధిలోని పంటలపై ఏనుగులు దాడి చేశాయి. బసన్నగారిపల్లెకు చెందిన సుధాకర్ పొలంలో 30 కొబ్బరి చెట్లు, మామిడి చెట్లను నేలమట్టం చేశాయి. పొలం చుట్టు ఉన్న ఇనుప కంచెను సైతం ధ్వంసం చేశాయి. మోటార్లకు అమర్చిన పైపులు, డ్రిప్ను విరిచేశాయి. రూ.4 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న కేవీపల్లె రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంటరిగా అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.