మదనపల్లె యువకుడిపై పీడీ యాక్టు
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:48 AM
అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మదనపల్లెకు చెందిన ఒక యువకుడిని పీడీ యాక్ట్ కింద నిర్బంధించడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కలికిరి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మదనపల్లెకు చెందిన ఒక యువకుడిని పీడీ యాక్ట్ కింద నిర్బంధించడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె పట్టణ శివారులోని బుగ్గకాలువ వద్ద నివాసముంటున్న ముడే బాలాజీ నాయక్ (32)ను పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకుని నిర్బంధించాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఈనెల ఒకటో తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పోలీసులు బాలాజీ నాయక్ను కడప జిల్లా కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. దీనికి ఆమోదం పొందడం కోసం కలెక్టరు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పూర్వాపరాలను పరిశీలించి కలెక్టరు ఉత్తర్వులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.