ఒక్కరోజే.. పది వేలకు పైగా
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:25 AM
కొత్త పింఛన్ల కోసం శుక్రవారం పది వేలకుపైగా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 24,118 దరఖాస్తులు అందాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా సామాజిక భద్రత పెన్షన్ పొందేందుకు ఏర్పాట్లు చేశారు.
కొత్త పింఛన్లకోసం దరఖాస్తుల వెల్లువ
స్వీకరణకు మూడు రోజుల విరామం
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల కోసం శుక్రవారం పది వేలకుపైగా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 24,118 దరఖాస్తులు అందాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా సామాజిక భద్రత పెన్షన్ పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా వుండగా సర్వర్ లోడ్ పెంచడంతో దరఖాస్తుల అప్లోడింగ్ చురుగ్గా సాగుతున్నది. ఇప్పటి వరకు అత్యధికంగా 14,049 వృద్ధాప్య, 110 ఒంటరి మహిళ, 61 చేనేత, 5202 వితంతు, 4662 దివ్యాంగుల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలావుండగా గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన మ్యాపింగ్లో జరిగిన తప్పిదాలతో దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడం. లేదు. వివిధ కారణాలతో భర్త మృతి చెంది ఉంటే రేషన్ కార్డులో ఇంటి యజమాని పేరు తొలగించలేదు. దీంతో వితంతువుల పేర్లు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. కొందరు ఆధార్లో తప్పుడు వయసు, ఇంటిపేరు, చిరునమా, మార్పుల సమయంలో సరిదిద్దుకున్నారు. వీరి నవీకరణ సమాచారం ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడంతో సచివాలయాల్లో ఉద్యోగులు దరఖాస్తు ఫారాలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇదిలావుండగా శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వసెలవు రోజులు కావడంతో మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.