కొనసాగుతున్న పెన్డౌన్
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:51 AM
రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ల తయారీ కోసం పీపీపీ పద్ధతిలో ఆర్ఎస్కే సేవా కేంద్రాలను ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్ల పెన్డౌన్ సమ్మె రెండో రోజుకు చేరింది.
డాక్యుమెంట్ రైటర్ల సమ్మెతో తగ్గిన రిజిస్ట్రేషన్లు
తిరుపతి సిటీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ల తయారీ కోసం పీపీపీ పద్ధతిలో ఆర్ఎస్కే సేవా కేంద్రాలను ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్ల పెన్డౌన్ సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బైఠాయించిన డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఒకవేళ ఆర్ఎస్కే సేవా కేంద్రాలు ఏర్పాటు అనివార్యమైతే తమను కూడా కొనసాగించాలని, వినియోగదారులకు ఎక్కడ సౌలభ్యం ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకునే హక్కు కల్పించాలని కోరారు. కాగా మంగళవారం రిజిస్ట్రేషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. నామమాత్రంగా మార్టిగేజ్లు, శెట్టిపల్లె రైతుల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ఆలోచిస్తున్నట్టు సమాచారం.