శిల్పారామం అభివృద్ధికి మళ్లీ నోటిఫికేషన్
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:06 AM
తిరుపతి శిల్పారామం అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ జారీచేయాలని నిర్ణయించింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం జిల్లాకు సంబంఽధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీ వైద్య విభాగంలో మూడు పోస్టులు అప్గ్రేడ్
తిరుపతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): తిరుపతి శిల్పారామం అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ జారీచేయాలని నిర్ణయించింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం జిల్లాకు సంబంఽధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి శిల్పారామంలో కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధితో పాటు గెస్ట్రూమలు, స్పా ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గార్డెన్సిటీ రియాలిటీ సంస్థ ముందుకు రావడంతో ప్రభ్వుతం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేసింది. అయితే గడువులోపు ఆ సంస్థ ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాప్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీతో అగ్రిమెంట్, లీజు డీడ్ కుదుర్చుకోవడంలో విఫలమవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను రద్దు చేయాలంటూ శిల్పారామం సొసైటీ సీఈవో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై చర్చించిన మంత్రివర్గం ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను రద్దు చేయాలని నిర్ణయించింది. కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చేందుకుగానూ మంత్రివర్గం శిల్పారామం సొసైటీ సీఈవోకు అనుమతి ఇచ్చింది.
పలమనేరు ఏఎంసీకి వెటర్నరీ వర్శిటీ భూములు
తిరుపతి ఎస్వీ వేదిక్ వర్శిటీకి చెందిన 33ఎకరాల భూమిని పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేదిక్వర్శిటీ పరిధిలోని పలమనేరు లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ భూముల్లో 33ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీ కోసం కేటాయించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ భూములకు వ్యవసాయ మార్కెటింగ్శాఖ పరిహారం కూడా చెల్లించింది. ఆ నేపథ్యంలో వెటర్నరీ వర్శిటీకి చెందిన 33ఎకరాల భూములను పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి కేటాయించేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. కాగా ఎస్వీ వేదిక్ వర్శిటీకి సంబంధించి కొన్ని అంశాలలో లెప్రసీ అన్న పదాన్ని తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. టీటీడీ వైద్య విభాగంలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, చీఫ్ ఫిజియో థెరపిస్ట్ తదితర మూడు పోస్టులను కొత్తగా క్రియేట్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక రేడియాలజిస్ట్, ఒక ఫిజియోథెరఫిస్ట్ పోస్టులను అప్గ్రేడ్ చేయడం ద్వారా కొత్త పోస్టులు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇచ్చింది.