నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:27 AM
విద్యుత్ శాఖ ఉద్యోగి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. తన వెంట తీసుకువచ్చిన కూలీతో విద్యుత్ సరఫరా ఆపకుండానే మరమ్మతు పనులు చేయించడంతో, ఆ విద్యుత్ స్తంభంపైనే విద్యుదాఘతానికి గురై ఆ కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
దొరవారిసత్రం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి):విద్యుత్ శాఖ ఉద్యోగి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. తన వెంట తీసుకువచ్చిన కూలీతో విద్యుత్ సరఫరా ఆపకుండానే మరమ్మతు పనులు చేయించడంతో, ఆ విద్యుత్ స్తంభంపైనే విద్యుదాఘతానికి గురై ఆ కూలీ ప్రాణాలు కోల్పోయాడు.దొరవారిసత్రం మండలం మావిళ్లపాడుకు చెందిన దొడ్డి గుంటకయ్య(28) కొంత కాలంగా విద్యుత్ శాఖ అధికారుల వద్ద సహాయక కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం పాలెంపాడులో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో గుంటకయ్యను తీసుకుని లైన్ఇన్స్పెక్టర్ నాగరాజు గ్రామానికి వెళ్లాడు. విద్యుత్ స్తంభంపై లైన్లు తెగిపోయి ఉండడంతో సరిచేసేందుకు గుంటకయ్యను స్తంభం ఎక్కించాడు.అయితే విద్యుత్ సరఫరా ఆపకపోవడంతో గుంటకయ్యను విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి గుంటకయ్య భార్య, నలుగురు పిల్లలు అక్కడకు చేరుకుని భోరుమన్నారు.వారి వెంట వచ్చిన మావిళ్లపాడు గ్రామస్తులు గుంటకయ్య మృతదేహం వద్ద బైఠాయించారు.అతడి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని, విద్యుత్శాఖ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.విద్యుత్శాఖ అధికారులతో పాటు పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.