పుస్తక పఠనంతోనే మనోవికాసం
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:02 AM
మంచి పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం 18వ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.
తిరుపతి పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రముఖులు
తిరుపతి (కల్చరల్), జనవరి 31(ఆంధ్రజ్యోతి): మంచి పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం 18వ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కె.వి.చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివి అర్థం చేసుకొని వాటిని జీవితంలో ఆచరించాలని అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం
కృత్రిమ మేధ రాజ్యమేలుతున్నా పుస్తక పఠనం వల్ల కలిగే మానసికానందం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలియజేశారు.పుస్తక ప్రదర్శన కన్వీనర్, భారతీయ విద్యా భవన్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని,సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించడం కోసమే భారతీయ విద్యాభవన్ స్థాపన జరిగిందన్నారు.విశిష్ట అతిధి, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు.ఈ పుస్తక ప్రదర్శనలో ఆధ్యాత్మిక , విద్య, వైద్య, వైజ్ఞానిక, చారిత్రక, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల స్టాళ్లు 95 ఏర్పాటు చేశారు.