ఇక బాగా కనిపిస్తుంది
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:11 AM
చిన్న వయసులోనే పిల్లలను కంటి సమస్యలు వేధిస్తున్నాయి.
చిత్తూరు రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పోషకాహార లోపం, ఆన్లైన్ చదువు, టీవీ, సెల్ఫోన్ ఎక్కువగా చూడడం తదితర కారణాలతో చిన్న వయసులోనే పిల్లలను కంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా కళ్లద్దాలు వాడకం తప్పనిసరవుతోంది. అయితే కంటి పరీక్షలు, కళ్లద్దాల కొనుగోలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూటమి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేయించి కళ్లద్దాలు అందించే కార్యక్రమం చేపట్టింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరీక్షలు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలలతోపాటు కళాశాల విద్యార్థులకూ అమలు చేస్తోంది. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించడంతోపాటు అవసరమైన వారికి అద్దాలు అందజేస్తోంది. గతేడాది జూలై 21 నుంచి అక్టోబరు 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 57,561 మంది విద్యార్థులకు కంటిపరీక్షలు చేయగా 3477 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వీరందరికీ మంగళవారం నుంచి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.