తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభం
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:59 AM
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన 16 వాహనాలు మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటి ద్వారా గర్భిణులు,బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణాసేవలు అందించనున్నారు.
జిల్లాకు చేరిన 16 సర్వీసులు
ఆధునిక వసతుల కల్పన
తిరుపతి(కలెక్టరేట్)/తిరుపతి సెంట్రల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన 16 వాహనాలు మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటి ద్వారా గర్భిణులు,బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణాసేవలు అందించనున్నారు. అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ వాహనాలను కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, టీడీపీ నేతలు నరసింహయాదవ్, జేబీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు ఈ సేవలను ప్రత్యేకంగా వినియోగించుకోవాలన్నారు. 102 నెంబరుకు ఫోన్చేసి తల్లిబిడ్డ సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాకు 16 వాహనాలు కేటాయించగా 15 వాహనాలు తిరుపతి ప్రాంతానికి, ఒక వాహనం శ్రీకాళహస్తికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, డీటీవో మురళీమోహన్, బీజేపీ నేత గుండాల గోపీనాథ్, డీసీహెచ్ఎ్స ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను వారి ఇళ్ల వద్ద విడిచిపెట్టి వస్తారు.నవజాత శిశువులు, బాలింతల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వాహనాల్లో వసతులు సమకూర్చారు.. ఎస్యూవీ, ఎంవీయూ మోడల్లో వుండి తల్లులు సులభంగా ఎక్కడానికి ఫుట్రె్స్టలు, లోపల హ్యాండ్ రెయిల్స్ ఏర్పాటు చేశారు.
ఫఅత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి వీలుగా వాహనాల్లో ఎస్ఓఎస్ బటన్ ఏర్పాటు చేశారు. ఇది నొక్కగానే 102 కాల్ సెంటరుకు సమాచారం చేరుతుంది. వాహనానికి ఏర్పాటు చేసిన జీపీఎస్ ద్వారా వాహనం వున్న స్థానం తెలుసుకుని సమీప వైద్య సదుపాయాలతో సమన్వయం చేసే వెసులుబాటు కల్పించారు.
వసతులు బాగున్నాయి
తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు అత్యాధునిక వసతులతో చాలా బాగున్నాయి. గతంలో వాహనాలు ఎక్కడానికి దిగడానికి బాలింతలు ఇబ్బందులు పడేవారు. బాలింతలు, నవజాత శిశువుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాహనాల్లో ప్రత్యేకంగా ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఎస్ఓఎస్ ద్వారా 102 కాల్ సెంటర్కు సమాచారం అందే విధంగా సెన్సార్లు, జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
- డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్