కాణిపాక ఆలయంలో అభిషేకం టిక్కెట్ గోల్మాల్!
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:00 AM
కాణిపాక ఆలయంలో రెండు అభిషేక టికెట్లకు డబ్బు తీసుకుని.. ఒక టిక్కెట్ ఇచ్చారు. మరొకటి ఆ ఉద్యోగి జేబులో ఉంది. ఆలయం వద్ద భక్తులను తనిఖీ చేసే క్రమంలో ఈ విషయం బయటపడింది. ఇలా అభిషేకం టిక్కెట్ గోల్మాల్ జరగడం చర్చనీయాంశమైంది.
ఉద్యోగికి నోటీసిచ్చిన అధికారులు
ఐరాల(కాణిపాకం), జూలై 21(ఆంధ్రజ్యోతి): కాణిపాక ఆలయంలో రెండు అభిషేక టికెట్లకు డబ్బు తీసుకుని.. ఒక టిక్కెట్ ఇచ్చారు. మరొకటి ఆ ఉద్యోగి జేబులో ఉంది. ఆలయం వద్ద భక్తులను తనిఖీ చేసే క్రమంలో ఈ విషయం బయటపడింది. ఇలా అభిషేకం టిక్కెట్ గోల్మాల్ జరగడం చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం స్వామివారికి నిర్వహించిన అభిషేకానికి రెండు కుటుంబాల నుంచి నలుగురు వచ్చారు. టిక్కెట్ కౌంటర్లో రెండు అభిషేకం టిక్కెట్లు కొనుగోలు చేశారు. అక్కడి ఉద్యోగి భక్తులకు ఒక టిక్కెట్ ఇచ్చారు. మీరు అభిషేకానికి వెళ్లండి.. నేను ఆలయంలోకి వస్తానని చెప్పి వారి పంపేశారు. ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు వారిని టిక్కెట్లు అడగ్గా.. ఒకటి చూపారు. తాము రెండు టిక్కెట్లు కొనుగోలు చేశామని, కౌంటర్లో ఉద్యోగి ఒక్కటే ఇచ్చి పంపారని చెప్పారు. ఈ విషయాన్ని ఆలయాధికారులు ఈవో పెంచలకిషోర్కు తెలియజేశారు. వెంటనే ఈవో టిక్కెట్ కౌంటర్లో పని చేస్తున్న వ్యక్తికి నోటీసు అందించారు. ఆ ఉద్యోగిని ఈవో తనిఖీ చేయగా అతడి ప్యాంటు జేబులో ఓ టిక్కెట్టు ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయంలో నూతనంగా వాట్స్ప్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంజినీరింగ్ శాఖ ఉద్యోగులకు సేవా టిక్కెట్ కౌంటర్లో విధులు కేటాయించామన్నారు. ఖచ్చితంగా ఉద్యోగి టిక్కెట్ గోల్మాల్ చేశారని చెప్పలేమన్నారు. దీనిపై విచారించి, ఒకవేళ ఆ ఉద్యోగి తప్పు చేసుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.