బోయకొండలో అర్చకుల వద్ద అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:12 AM
బోయకొండలో అర్చకుల వద్ద డబ్బు వసూలు చేసిన మహిళా జూనియర్ అసిస్టెంట్(కాంట్రాక్ట్)ఉద్యోగి భారతిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.
చౌడేపల్లె, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): బోయకొండలో అర్చకుల వద్ద డబ్బు వసూలు చేసిన మహిళా జూనియర్ అసిస్టెంట్(కాంట్రాక్ట్)ఉద్యోగి భారతిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. ఆలయ అర్చకుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నారని, హుండీ ఆదాయం తగ్గిందని రాష్ట్ర పాల ఏకిరి కొర్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరనాయుడు ఫిర్యాదు మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిశోర్ ఇటీవల విచారణ చేపట్టినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా భారతి అర్చకులు వద్ద డబ్బు వసూలు చేసినట్టు కన్పించిందన్నారు. ఆమెను వివరణ కోరి, సస్పెన్షన్ చేసినట్టు తెలిపారు. విచారణ జరుపుతున్నామన్నారు. కాగా గతంలో ఆమె ఆలయ నిధులు బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వినియోగించుకోవడం, కొండ కింద షాపుల అద్దెను సైతం బ్యాంకుకు జమ చేయకుండా స్వాహా చేసిన ఘటనల్లో పలుమార్లు సస్పెన్షన్కు గురైనట్టు తెలిపారు.
వీరిపై కూడా దృష్టి సారిస్తారా?
బోయకొండ పై అమ్మవారి సన్నిధిలో భక్తుల నుంచి కూడా అక్రమ వసూళ్లు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఆలయం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే అలాంటి వారిని గుర్తించవచ్చు. అలాంటి వారిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.