ఆరెంజ్ జోన్లో ఐదు మండలాలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:21 AM
ఒక వైపు ఎండ మంట. మరో వైపు భరించలేని ఉక్కపోత. దీంతో మంగళవారం జిల్లాలో జనం అల్లాడిపోయారు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఒక వైపు ఎండ మంట. మరో వైపు భరించలేని ఉక్కపోత. దీంతో మంగళవారం జిల్లాలో జనం అల్లాడిపోయారు. ఫ్యాన్ల కింద సేదదీరినా చెమటలు కారిపోయాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 18 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రమాదకరంగా ఐదు మండలాలు ఆరెంజ్ జోన్లోకి చేరాయి. ఇప్పటి వరకు ఎండలు అధికంగా ఉన్న ఉక్కపోత అంతగా ఇబ్బంది పెట్టలేదు. గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరగడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. మరో పది రోజుల పాటు ఇలా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరెంజ్ జోన్లోకి ఎస్ఆర్పురం 42.6, నగరి 42.4, విజయపురం 41.7, పలమనేరు 41.3, గంగవరం 40.9 డిగ్రీలతో చేరాయి. ఇక మండలాల వారీగా.. చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్ 41.8, గుడిపాల, తవణంపల్లె, బంగారుపాళ్యంలో 41.3, పూతలపట్టు, శాంతిపురం 41, గంగాధరనెల్లూరు 40.9, పెద్ద పంజాణి 40.6, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 40.2, ఐరాలలో 40, నిండ్రలో 39.5, రొంపిచెర్లలో 39.3, కార్వేటినగరంలో 39.2, పులిచెర్ల, వెదురుకుప్పంలో 39.1, గుడుపల్లెలో 37.9, కుప్పం, రామకుప్పంలో 37.6, బైరెడ్డిపల్లె, వీకోటలో 37.4 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.