Share News

నగల కోసం వృద్ధురాలి హత్య

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:40 AM

రైల్వేకోడూరు పట్టణంలో ఓ మహిళ హత్యకు గురైంది. వినాయకనగర్‌లో ఒంటరిగా నివసిస్తోన్న రాజుపాళెం మంగమ్మ(70) సోమవారం రాత్రి సమీపంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపుకాచిన కొందరు రాళ్లతో దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు..

నగల కోసం వృద్ధురాలి హత్య
హత్యకు గురైన రాజుపాళెం మంగమ్మ

రైల్వేకోడూరు,సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరు పట్టణంలో ఓ మహిళ హత్యకు గురైంది. వినాయకనగర్‌లో ఒంటరిగా నివసిస్తోన్న రాజుపాళెం మంగమ్మ(70) సోమవారం రాత్రి సమీపంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపుకాచిన కొందరు రాళ్లతో దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు.. మంగళవారం ఉదయం ఇంటి సమీపంలో మంగమ్మ శవమై కన్పించడం గమనించిన కుమార్తె అంజనాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. మృతురాలి వంటిపై సుమారు నాలుగు తులాల బంగారు నగలు కనిపించకుండాపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దర్యాప్తులో భాగంగా డాగ్‌స్వ్కాడ్‌, ఫోరెన్సిక్‌, క్లూస్‌టీమ్‌, డ్రోన్‌ సర్వైలెన్స్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ వై. శ్రీనివాసరావు తెలిపారు.సీఐలు చంద్రశేఖర్‌, శ్రీనివాసులు,ఎస్‌ఐలు వీఎల్‌ ప్రసాద్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, బృందంగా ఏర్పడి ఈ హత్య కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.మంగమ్మ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య సమాచారం తెలుసుకుని కడప జిల్లా ముద్దనూరులో ఉన్న మంగమ్మ కుమారుడు బాబు, కోడలు శ్రీదేవి, బంధువులు రైల్వేకోడూరుకు చేరుకున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:40 AM