పీలేరు రైల్వేస్టేషన్లో డ్రోన్ భద్రత
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:15 AM
పీలేరు రైల్వేస్టేషన్లో త్వరలో డ్రోన్ ఆధారిత నిఘా, భద్రత వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సీఐ రవిశంకర్ తెలిపారు.
పీలేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): పీలేరు రైల్వేస్టేషన్లో త్వరలో డ్రోన్ ఆధారిత నిఘా, భద్రత వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సీఐ రవిశంకర్ తెలిపారు. ఆర్పీఎఫ్ పోలీసుల భద్రత, నిఘా వ్యవస్థల పనితీరుపై శుక్రవారం ఆయన నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. డ్రోన్ ఫ్లైట్ ప్రదర్శన, శిక్షణ గురించి ప్రయాణికులు, ఉద్యోగులకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ డ్రోన్ ఆధారిత వైమానిక నిఘా ప్రాధాన్యత, దాని ద్వారా రైల్వే పరిధిలో భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించే విధానం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను సమర్థవంతంగా వినియోగించడంపై సమగ్రంగా వివరించారు. డ్రోన్ల ద్వారా 4 కిలోమీటర్ల పరిధిలో రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, సర్క్యులేటింగ్ ఏరియా, సున్నితమైన ప్రాంతాలు, సాధారణ పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, నేరస్తుల సంచారం, ఇతర అక్రమ కార్యకలాపాలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టవచ్చునన్నారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ రాంబాబు, హెచ్సీ నారాయణ పాల్గొన్నారు.