53 నివాసిత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:48 AM
53 నివాసత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం బంగారుపాళ్యం, పూతలపట్టు, పెద్దపంజాణి, విజయపురం తదితర మండలాల్లోని 53 నివాసత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. బోర్వెల్స్, పైప్ లైన్లు, పంపు నిర్మాణం పనులు పరిశీలించి.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. ‘ఆయా మండలాల్లో ఏఈలు, ఎంపీడీవోలు క్లీనింగ్, నీటి పైపుల మరమ్మతు పనులు పరిశీలించారు. నీటి వృథాను అరికట్టాలి. నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి. 15 రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రంచేసి క్లోరినేషన్ చేయాలి. 15 రోజుల నుంచి పలు సచివాలయాల్లో నిర్వహించే ఆధార్ కేంద్రాలు పనిచేయడం లేదంటూ నివేదికలు అందుతున్నాయి. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి.. చిన్న చిన్న మరమ్మతులుంటే పూర్తి చేయాలి. పెనుమూరు, ఎస్ఆర్ పురం, చిత్తూరు అర్బన్, కార్వేటినగరం, గుడిపాల మండలాల్లోని ఆధార్ సెంటర్లు వారంలో యఽథావిధిగా పనిచేయాలి’ అని ఆదేశించారు. ఈనెల 25న జ్యోతిరావుపూలే భవనంలో సత్యవేడు, ఎస్ఈజడ్ ఆధ్వర్యంలో కంపెనీలు జాబ్మేళా నిర్వహిస్తాయన్నారు. దీనిపై మండలస్థాయిలో యువతకు అవగాహన కల్పించాలన్నారు.