రెగ్యులర్ తహసీల్దార్ నియామకంలో జాప్యం
ABN , Publish Date - May 14 , 2026 | 12:06 AM
సారథి లేని రథం ఎలాగైతే వంకర్లు పోతుందో అలా తయారైంది జిల్లా కేంద్రం మదనపల్లె పరిస్థితి. పట్టణాన్ని, మండలాన్ని నడిపించే అధికారి లేకపోవడంతో పాలన పక్కదారి పట్టింది. సమస్యలు పరిష్కరించే వారు లేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
జిల్లా కేంద్రంలో సక్రమంగా అందని రెవెన్యూ సేవలు
సారథి లేని రథం ఎలాగైతే వంకర్లు పోతుందో అలా తయారైంది జిల్లా కేంద్రం మదనపల్లె పరిస్థితి. పట్టణాన్ని, మండలాన్ని నడిపించే అధికారి లేకపోవడంతో పాలన పక్కదారి పట్టింది. సమస్యలు పరిష్కరించే వారు లేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
మదనపల్లె టౌన్, మే 13(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన మదనపల్లెకు రెగ్యులర్ తహసీల్దార్ను నియమించడంలో జాప్యం జరుగుతోంది. పట్టణం, మండలం కలిపి రెండున్నర లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడి తహసీల్దార్ కిశోర్కుమార్రెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఏప్రిల్ 5న కలెక్టరేట్కు బదిలీ చేశారు. అప్పటి నుంచి నుంచి రెగ్యులర్ తహసీల్దార్ను నియమించలేదు. ఇక్కడ పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ వెంకటస్వామి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో రెవెన్యూ సేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.
విధులు బోలెడు
పెద్ద మండలమైన మదనపల్లెలో తహసీల్దార్ విధులెక్కువే. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలి. ప్రోటోకాల్ విధులుంటాయి. వీటితో పాటు 336 హైకోర్టు కేసులు, 200పైగా స్థానిక కోర్టులో రిట్ పిటిషన్లు, కేసుల వాయిదాలకు హాజరుకావాలి. 22-ఏ ఫైళ్లను పరిశీలించి, మ్యుటేషన్లను అంగీకరించాలి. భూసేకరణలో బాధితులకు నష్టపరిహారం ఫైళ్లను ముందుకు నడపాలి. సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. పీజీఆర్ఎస్ అర్జీలను పరిష్కరించాలి. రెగ్యులర్ తహసీల్దార్ ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.
జోడు పడవల మధ్య ప్రయాణం
డిప్యూటీ తహసీల్దార్ తన ప్రధాన విధులను నిర్వర్తిస్తూ తహసీల్దార్ కార్యాలయం పనులు చేయడం కష్టంగా ఉంటోంది.. నెలన్నరగా రెండు విధులు ఒక్కరే చేస్తుండటంతో, ప్రజలకు నిర్దేశిత సమయంలో సేవలు సక్రమంగా అందడం లేదు. సదరు అధికారికి జోడు పడవల మధ్య ప్రయాణంలా తయారైంది. డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయానికే పరిమితం కావడంతో మదనపల్లె పట్టణం, మండలంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, వాగు పొరంబోకు స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా రెగ్యులర్ తహసీల్దార్ నియామకంపై మల్లాగుల్లాలు పడుతున్నారు.