మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:32 AM
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్ వెంకటేశ్వర్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సూచించారు.వడమాలపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ఆర్ధిక ఆసరా చెక్కులను వారు అందజేశారు.
వడమాలపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్ వెంకటేశ్వర్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సూచించారు.వడమాలపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ఆర్ధిక ఆసరా చెక్కులను వారు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించి, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య, ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైతులు కూరగాయలు, పూల తోటలు,, పండ్ల తోటలు వంటి వాణిజ్య పంటలు సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచిస్తూ, తక్కువ వ్యయంతో మెరుగైన దిగుబడులు సాధించేందుకు సహజ వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడతాయన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద రావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద జిల్లావ్యాప్తంగా 1,65,689మంది రైతులకు సుమారు రూ.111 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నారని తెలిపారు. ఏడీఏలు లక్ష్మీదేవి, కవిత,వ్యవసాయాధికారి విజయకుమార్, టీడీపీ నేతలు మురళీధర్ రెడ్డి, దాముయాదవ్, ధనంజయులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.