రేపు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:25 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఖాళీల భర్తీలో డీఎస్సీ-2008లో అర్హులైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత, అనంతరం ఖాళీలకు డీఎస్సీ-1998లో అర్హులైన అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు. చిత్తూరు డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 11 గంటలకు సీనియారిటీ జాబితాను అనుసరించి 1 నుంచి 250 వరకు.. మధ్యాహ్నం 3 గంటలకు 251-490 అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన కౌన్సెలింగ్లో పాల్గొనని వారు, అనధికారిక గైర్హాజరులో ఉన్నవారు, మంజూరైన సెలవుల అనంతరం విధుల్లో చేరని వారు ఈ కౌన్సెలింగ్కు అనర్హులన్నారు.