వేసవికంతా చిత్తూరుకు ‘అడవిపల్లె’ నీళ్లు
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:42 AM
కరువు ప్రాంతంగా ఉన్న చిత్తూరులో తాగునీటి కోసం వేసవి రాకముందే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీయార్ జలాశయాన్ని నిర్మించింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే.. వాగుల ద్వారా వచ్చే వరదతో జలాశయం నిండేది. ఒకసారి నిండితే నగరంలోని బోర్లతో పాటు జలాశయం నీటిని ఏడాది వరకు చిత్తూరుకు సరఫరా చేసేవారు. ఒకవేళ సమృద్ధిగా వర్షాలు కురవకుంటే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో శాశ్వత నీటి పరిష్కారం చూపేందుకు 2016లో అప్పటి ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధ అమృత్ పథకం కింద నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థ వాటాతో కలిపి రూ. 250కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు పైపులైన్ పనులను ప్రారంభించారు. ఏడాది పాటు పనులు జరిగాక ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. వైసీపీ ఏం చేసింది? 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి రెండేళ్ల వరకు ‘అడవిపల్లె రిజర్వాయరు’ నుంచి నీటిని తీసుకొచ్చే పనులను గాలికొదిలేసింది. ఈ పనులు చేపట్టకపోతే అమృత్ నిధులు వెనక్కి తీసేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయడంతో.. పనులను ప్రారంభించి తర్వాత వదిలేశారు. ‘కూటమి’ వచ్చాక కదలిక
సాంకేతిక అడ్డంకుల పరిష్కారంతో జోరుగా సాగుతున్న పనులు
రూ.250 కోట్ల అమృత్ నిధులున్నా పనులు చేయని గత ప్రభుత్వం
ఎండాకాలం వస్తోందంటే చాలు.. చిత్తూరు ప్రజలు ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి 2016లో మొదలైన ఆలోచన.. 2018 నాటికి ‘అడవిపల్లె రిజర్వాయరు’ పథకంగా రూపుదిద్దుకుంది. మధ్యలో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఈ పథకం.. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో ముందుకు కదిలింది. వచ్చే వేసవికి చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
కరువు ప్రాంతంగా ఉన్న చిత్తూరులో తాగునీటి కోసం వేసవి రాకముందే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీయార్ జలాశయాన్ని నిర్మించింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే.. వాగుల ద్వారా వచ్చే వరదతో జలాశయం నిండేది. ఒకసారి నిండితే నగరంలోని బోర్లతో పాటు జలాశయం నీటిని ఏడాది వరకు చిత్తూరుకు సరఫరా చేసేవారు. ఒకవేళ సమృద్ధిగా వర్షాలు కురవకుంటే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో శాశ్వత నీటి పరిష్కారం చూపేందుకు 2016లో అప్పటి ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధ అమృత్ పథకం కింద నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థ వాటాతో కలిపి రూ. 250కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు పైపులైన్ పనులను ప్రారంభించారు. ఏడాది పాటు పనులు జరిగాక ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి.
వైసీపీ ఏం చేసింది?
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి రెండేళ్ల వరకు ‘అడవిపల్లె రిజర్వాయరు’ నుంచి నీటిని తీసుకొచ్చే పనులను గాలికొదిలేసింది. ఈ పనులు చేపట్టకపోతే అమృత్ నిధులు వెనక్కి తీసేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయడంతో.. పనులను ప్రారంభించి తర్వాత వదిలేశారు.
‘కూటమి’ వచ్చాక కదలిక
2018లో పనులు ప్రారంభించినా కొన్ని అనుమతులు తీసుకోలేదు. అడవిపల్లె రిజర్వాయర్ కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ భూములకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అనుమతివ్వాలి. పీలేరు నుంచి చిత్తూరు వరకు రోడ్డు కటింగ్ చేసి పైపు లైన్ వేయాలి. దీనికిగాను హైవే, నేషనల్హైవే, పంచాయతీరాజ్ శాఖల అనుమతులు పెండింగులో ఉన్నాయి. దామలచెరువు సమీపంలో నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ)కు అనుమతి రావాలి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ పనుల్లో కదలిక వచ్చింది. పెండింగు అనుమతులపై చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు నివేదిక అందించారు. వీరు అధికారులతో పలుమార్లు చర్చించి సమస్యలను క్లియర్ చేయడంతో పైపులైను పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే సమ్మర్నాటికి అడవిపల్లె రిజర్వాయర్ నీటిని చిత్తూరుకు తీసుకొచ్చేలా పనులు చేస్తున్నామని నగరపాలక సంస్థ డీఈఈ పుష్పగిరి నాయక్ తెలిపారు.
మిగిలిన పనులివే
అడవిపల్లె రిజర్వాయర్లో ఇంటెక్వెల్ను తవ్వాలి. మొత్తం కేపాసిటీ 1.43 టీఎంసీలు కాగా అందులో నుంచి 0.78 టీఎంసీల నీటిని చిత్తూరుకు గ్రావిటీ ద్వారా తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం పెనుమూరు క్రాస్లో పైపులైను పనులు జరుగుతున్నాయి. రిజర్వాయర్లో ఇంటెక్వెల్, దామలచెరువు వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రోడ్డు కటింగ్ పనులతో పాటు మరో పది కిలోమీటర్ల వరకు పైపులైన్ వేయాల్సి ఉంది.
రిజర్వాయరు నుంచి నీళ్ల రాక ఇలా..
అడవిపల్లె రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా పైపులైన్లలో దామలచెరువు వద్ద నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు నీటిని సరఫరా చేస్తారు. అక్కడ శుద్ధి చేశాక చిత్తూరుకు చేరుతుంది. నగరంలో ఇప్పటికే ఉన్న కట్టమంచి, సంతపేట, కొంగారెడ్డిపల్లె, కొండమిట్ట, దుర్గానగర్కాలనీ, కైలాసపురం ట్యాంకులను నింపుతారు. ఆయా ట్యాంకుల నుంచి సమీపంలో ఉండే కాలనీలకు నీటిని సరఫరా చేస్తారు.
కార్పొరేషన్ వాటా రూ.160 కోట్లు
అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకు 93 కిలోమీటర్ల పైపులైన్.. దామలచెరువు వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రిజర్వాయర్ వద్ద ఇంటెక్వెల్ తదితర పనులకు రూ.250 కోట్లను కేటాయించారు. అందులో దాదాపు రూ.160 కోట్లు చిత్తూరు నగరపాలక సంస్థ ఇవ్వనుంది. దీనికిగాను బ్యాంకులో రుణం తీసుకుని నెలవారీగా కంతులు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.25 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.65 కోట్లను కేంద్రం ఇవ్వనుంది.