Share News

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:51 AM

రూ.2.48 లక్షల నగదు స్వాధీనం

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు

తిరుపతి సిటీ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. దీంతో సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో కలకలం రేగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు వివరాలకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని విచారించారు. నగదుతోపాటు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్‌ రికార్డులను, సంబంధిత దస్తావేజులను, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఏసీబీ తనిఖీలు కొనసాగుతుండడంతో కార్యాలయానికి వచ్చిన డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో వీరిని కూడా విచారిస్తున్నట్టు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు జరిపామన్నారు. అన్‌ అకౌంటెడ్‌గా ఉన్న రూ2.48లక్షలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు

Updated Date - Aug 18 , 2026 | 01:51 AM