Share News

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:38 AM

చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్‌రిజిస్ర్టార్లు రమణరావు, విజయకుమార్‌ వద్ద పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్నారు.

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు
డాక్యుమెంట్‌ రైటర్లు, రిజిస్ర్టేషన్‌ కార్యాలయ సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్న ఏసీబీ అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్‌రిజిస్ర్టార్లు రమణరావు, విజయకుమార్‌ వద్ద పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం బయట ఉన్న సుమారు 15 మంది డాక్యుమెంట్‌ రైటర్లను పోలీసుల సహకారంతో ఏసీబీ అధికారులు లోపలకు తీసుకెళ్లారు. ఏయే రైటర్‌ వద్ద ఎంతెంత నగదు ఉంది? జరిగిన రిజిస్ర్టేషన్ల విలువ.. సబ్‌రిజిస్ర్టార్ల వద్దనున్న అదనపు నగదు తదితరాలపై ప్రశ్నించారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో సాయంత్రం 4.45 గంటలకు దాడులు ప్రారంభించగా, రాత్రి 9 గంటలకూ కొనసాగాయి.

ఏసీబీ సిబ్బందిపై తిరగబడిన రైటర్‌

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై దాడి చేయకముందే, ఏసీబీ సిబ్బంది ఒకరు రైటర్‌ రామకృష్ణ కార్యాలయంలోకి వెళ్లారు. ఐడీ కార్డు చూపించాలని రైటర్‌ కోరారు. ఏసీబీ సిబ్బంది ఐడీ కార్డు చూపకపోవడంతో రైటర్‌ తిరగబడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Updated Date - Mar 24 , 2026 | 12:38 AM