నేత్రపర్వం....తెప్పోత్సవం
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:42 AM
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.
శ్రీకాళహస్తి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామిని మొదట అలంకార మండపంలో విశేషంగా అలకరించి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. తెప్పలపై అధిష్టింపజేసి నారద పుష్కరిణిలో విహరింపజేశారు. తెప్పోత్సవాన్ని పురస్కరిం చుకుని కోనేటి చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ ఆకట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆడికృత్తిక ఘడియలు ఉండడంతో భక్తులు పెద్దసంఖ్యలో కావళ్లు మోస్తూ విజ్ఞానగిరికి తరలివచ్చారు. నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించి కొండపైకి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విజ్ఞానగిరిపై భక్తుల రద్దీ కొనసాగింది.