Share News

వీడనున్న 83 రోజుల మౌడ్యం

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:50 AM

శుక్రమౌడ్యం, గురు మౌడ్యంతో 83 రోజుల పాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి.

 వీడనున్న 83 రోజుల మౌడ్యం

మదనపల్లె టౌన్‌/తిరుపతి సిటీ, ఫిబ్రవరి 13(ఆంరఽధజ్యోతి): శుక్రమౌడ్యం, గురు మౌడ్యంతో 83 రోజుల పాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి.సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ. కాని ఈ సారి గతేడాది నవంబర్‌ 26వ తేది నుంచి ఫిబ్రవరి 17వ తేది వరకు శుక్రమౌడ్యం, గురుమౌడ్యం ఒకేసారి రావడంతో శుభకార్యాలకు, పెళ్లి ముహూర్తాలకు, గృహప్రవేశాలకు విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 17వ తేది నుంచి మే నెల 9వ తేది వరకు పెళ్లి ముహూర్తాలు వున్నట్లు శాస్త్రులు, వేదపారాయణులు చెబుతున్నారు. వధూ, వరుల జన్మనక్షత్రాలు, తారా బలం ఆధారంగా ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. మూడు నెలల్లో సుమారు 60 రోజుల పాటు పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు, వ్రతాలు, నిశ్చితార్థాలు జరగనున్నాయి. 83 రోజులు పాటు నిరీక్షించిన యువతకు 60 రోజుల ముహూర్తాలు స్వాంతన ఇవ్వనున్నాయి.దాదాపు 3నెలల పాటు పెళ్లిళ్లు జరగకపోవడంతో ఈసురోమంటూ కాలం వెళ్లదీసిన ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది.కళ్యాణమండపాలు, పురోహితులు, క్యాటరింగ్‌, డెకరేషన్‌, లాడ్జిలు, పూల వ్యాపారం, పట్టుచీరలు, వస్త్రాల వ్యాపారం, అతి ముఖ్యమైన బంగారం, వెండి వ్యాపారాలు, పెళ్లి పత్రికల వ్యాపారం, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ముద్రణ, సన్నాయి, నాదస్వరం, బ్యాండు మేళాలు ఇలా చెప్పుకుంటూ పోతే పలు రంగాలకు చెందిన వారు ముహూర్తాలు మొదలవడంతో ఆనందపడుతున్నారు. పెళ్ళి మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.తిరుమలలోనూ అనుకోని రీతిలో పెళ్ళిళ్ళు జరగనుండడంతో అక్కడ కూడా ప్రైవేటు సత్రాలకు డి మాండ్‌ పెరిగిపోయింది.

Updated Date - Feb 14 , 2026 | 01:50 AM