8 మంది బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:53 AM
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను ఆధారంగా చేసుకుని చిత్తూరులో రెండు చోట్ల ఆన్లైన్ బెట్టింగ్పై సోమవారం పోలీసులు దాడి చేశారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేయగా, తొమ్మిది మంది పరారయ్యారు. ఆ వివరాలను ఒకటి, రెండో పట్టణ పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు.
పరారీలో మరో 9 మంది
రెండు చోట్ల పోలీసుల దాడులు
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను ఆధారంగా చేసుకుని చిత్తూరులో రెండు చోట్ల ఆన్లైన్ బెట్టింగ్పై సోమవారం పోలీసులు దాడి చేశారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేయగా, తొమ్మిది మంది పరారయ్యారు. ఆ వివరాలను ఒకటి, రెండో పట్టణ పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు. వివరాలిలా ఉన్నాయి. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లను అరికట్టాలని ఎస్పీ తుషార్ డూడీ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం బెంగళూరు- చెన్నై హైవే రోడ్డులో శ్రుతి మిల్క్ డెయిరీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో అక్కడున్న వారు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కట్టమంచి బంగారమ్మతోటకు చెందిన విక్రమ్రెడ్డి, గిరింపేట బాలాజీనగర్కు చెందిన వినోద్కుమార్, శంకరయ్యగుంటకు చెందిన రిజ్వాన్, గంగనపల్లెకు చెందిన వంశీకృష్ణ, అనీష్ అహ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. దాంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో వినోద్, ఐశ్వర్య భర్త, వినోద్, మనికంఠ, వేణు, భరత్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో వారిని పట్టుకుంటామని సీఐ నెట్టికంఠయ్య మీడియాకు వివరించారు. ఐపీఎల్ మ్యాచ్లు లేదా ఇతర క్రీడల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బెట్టింగ్లు చట్టవిరుద్ధమన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమే్షబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
కట్టమంచి చెరువు వద్ద..
చిత్తూరు-తిరుపతి మెయిన్ రోడ్డులోని కట్టమంచి చెరువు కింద ఉన్న ఖాళీ స్థలంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ సమాచారంతో సీఐ మహేశ్వర, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కట్టమంచికి చెందిన జ్యోతీశ్వర్రెడ్డి, శశిధర్, సత్యసాయినాధ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుంటామన్నారు.