పచ్చదనం పెంచేందుకు తిరుపతి డివిజన్లో 15లక్షల సీడ్స్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:20 AM
రేపు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పచ్చదనం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2.5కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది.ఇందులోభాగంగా అటవీశాఖ అధికారులు తిరుపతి డివిజన్లో 15లక్షల సీడ్బాల్స్ను వెదజల్లనున్నారు.
తిరుపతి(కపిలతీర్థం), జూన్ 3(ఆంధ్రజ్యోతి): రేపు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పచ్చదనం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2.5కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది.ఇందులోభాగంగా అటవీశాఖ అధికారులు తిరుపతి డివిజన్లో 15లక్షల సీడ్బాల్స్ను వెదజల్లనున్నారు. పేడ, మట్టి, విత్తనాన్ని కలిపి బాల్లా తయారుచేసి డ్రోన్ల సాయంతో అటవీప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా విత్తనాలు మొలకెత్తి వృక్షాలుగా మారే అవకాశం ఉందని తద్వారా గ్రీనరీపెరిగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. శేషాచల అటవీప్రాంతంలో దాదాపు 50 రకాల చెట్లకు సంబంధించిన సీడ్బాల్స్ వేయనున్నారు.ఏయే ప్రదేశాల్లో ఏ మొక్కపెరుగుతుందో నిర్ధారించుకుని ఆ మొక్కకు సంబంధించిన విత్తనాలు వేయనున్నారు. ఇందులో రేలా, చింత, నారేపి, ఉసిరి, నల్లతుమ్మ, రాగి, మర్రి, జివ్వి, వెలగ తదితర మొక్కలకు సంబంధించిన విత్తనాలున్నాయి.