Share News

బెంగళూరు-విజయవాడ కారిడార్‌ 2027కల్లా పూర్తికావాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:49 AM

రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌ పనులు 2027కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

బెంగళూరు-విజయవాడ కారిడార్‌ 2027కల్లా పూర్తికావాలి

  • ఖరగ్‌పూర్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేకు త్వరగా డీపీఆర్‌: సీఎం

  • 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల విలువైన జాతీయ హైవేల పనులు పూర్తే లక్ష్యం

  • పోర్టులను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం

  • ప్రస్తుతం పురోగతిలో ఉన్న రూ.42,194 కోట్ల రోడ్ల పనులు వేగంగా పూర్తవ్వాలి

  • రహదారుల పూర్తిలో మన రాష్ట్రమే బెంచ్‌ మార్క్‌గా ఉండాలి.. సమీక్షలో చంద్రబాబు

అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌ పనులు 2027కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఖరగ్‌పూర్‌- అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా త్వరలోనే డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణం ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష జరిపారు. జాతీయ హైవేల నెట్‌వర్క్‌ విస్తరణ, రాష్ట్ర రోడ్లు, ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్ర ఉపరితల రవాణా శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. ‘మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరకు రవాణా చేసేలా, మారుమూల ప్రాంతాలను కనెక్ట్‌ చేసేలా రోడ్లు నిర్మించాలి. రోడ్డు ప్రాజెక్టుల పూర్తి విషయంలో మన రాష్ట్రం బెంచ్‌ మార్క్‌గా ఉండాలి. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులను 4 వరుసలు, ఆరు వరుసలుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలి. ప్రస్తుతం రూ.42,194 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతిలో ఉంది. వచ్చే ఏడాది డిసెంబరునాటికి వీటిని పూర్తి చేయాలి’ అని తెలిపారు.


కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వాలి..

రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన వివిధ రోడ్డు ప్రాజెక్టులకు కూడా అనుమతులు తీసుకుని వేగంగా పనులు చేపట్టాలని సీఎం సూచించారు. కేంద్రానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనలను కూడా తక్షణమే సమర్పించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, రాయపూర్‌-అమరావతి, మూలపేట పోర్టు, జగ్‌దల్‌పూర్‌, రాయపూర్‌లను కూడా అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో రహదారి నెట్‌వర్క్‌ విస్తరణ..

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రహదారి నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేయాలని సీఎం రోడ్లు-భవనాల శాఖను ఆదేశించారు. రూ.2,500 కోట్లతో 6,054 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రహదారుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. డేనిష్‌ ఫైబర్‌, వేస్ట్‌ ప్లాస్టిక్‌ బిటుమిన్‌,. తిరుపతి ఐఐటీ రూపొందించిన నానో కాంక్రీట్‌ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా రోడ్లను వేస్తున్నామని తెలిపారు. 45 వేల కిలోమీటర్ల రాష్ట్ర, జిల్లా రహదారుల్లో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. రామ్స్‌ టెక్నాలజీ ద్వారా రోడ్ల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీపీపీ కింద 709 కిలోమీటర్ల మేర 12 రహదారులను కూడా చేపట్టాలని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పటిష్ఠంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో ఆర్‌ అండ్‌ బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 05:49 AM