అందరి సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:13 PM
పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమమే తన, కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.
కళ్యాణదుర్గం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమమే తన, కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వడ్డె రాము, అతని కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో అమిలినేని ప్రచారం కోసం ఆ గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలోకి రాకుండా ఏకంగా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ ఉంచి.. వెళ్లిపోవాలని వాదించారు. ఇటీవల వడ్డె రాము భార్య శారద అనారోగ్యంతో మరణించినట్లు ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన గురువారం ఆ గ్రామానికి వెళ్లాడు. వడ్డె రామును పరామర్శించారు. రూ.50 వేలు ఆర్థికసాయం అందచేశారు. ఆయనకున్న ఇద్దరు ఆడపిల్లలనూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చారు. ఆదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిమ్మరాయుడు వెన్నునొప్పితో బాధపడుతుండడంతో వైద్య చికిత్స కోసం రూ. 10 వేలు అందచేశారు. దీంతో గ్రామస్థులు, వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.