నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండు
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:18 AM
తనకల్లులో రూ. లక్షలు వెచ్చించి .. నిర్మించిన ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా ఉంది. దీన్ని 15 ఏళ్ల క్రితం నిర్మించారు.
తనకల్లు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): తనకల్లులో రూ. లక్షలు వెచ్చించి .. నిర్మించిన ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా ఉంది. దీన్ని 15 ఏళ్ల క్రితం నిర్మించారు. ఒక కంట్రోలర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అక్కడ బస్సుల కోసం వేచి ఉండేవారు. అయితే ఎనిమిది సంవత్సరాలుగా ఆర్టీసీ అధికారులు అక్కడ కంట్రోలర్ను తీసివేశారు. బస్సులను కూడా బస్టాండ్లో కాకుండా అంబేద్కర్ సర్కిల్లో నిలపడం మొదలు పెట్టారు. దీంతో నాటి నుంచి ప్రయాణికులు అంబేద్కర్ సర్కిల్లో దుకాణాల ముందు నిలబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీడ, నీరు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళ ప్రయాణీకుల పాటు మరీ ఘోరం. బస్టాండ్లోనే బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.