Share News

MLA DAGGUPATI : నేషనల్‌ పార్కులో నీటి వనరుల మెరుగుకు చర్యలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM

నేషనల్‌ పార్క్‌లో నీటి వనరులు మెరుగుపరిచే విధంగా పనులు చేపడుతున్నట్లు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేషనల్‌ పార్క్‌లో ఆయన పర్యటించారు. ఈవారం జలధార-జలహారతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA DAGGUPATI : నేషనల్‌ పార్కులో నీటి వనరుల మెరుగుకు చర్యలు
MLA performing Bhoomi Pooja for pond construction tomorrow

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ పార్క్‌లో నీటి వనరులు మెరుగుపరిచే విధంగా పనులు చేపడుతున్నట్లు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేషనల్‌ పార్క్‌లో ఆయన పర్యటించారు. ఈవారం జలధార-జలహారతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చెక్‌డ్యామ్‌ వద్ద గంగపూజ చేశారు. అక్కడి నుంచి పార్కును పరిశీలించారు. చెక్‌డ్యాం పటిష్టతపై ఆరా తీశారు. వర్షపు నీటిని ఎక్కడెక్కడ నిలువు చేయొచ్చు, బోర్లు రీచార్జ్‌ అయ్యే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్నది ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం పార్క్‌లో పనిచేసే కార్మికులు, సిబ్బందితో కలసి ఆయన అల్పాహారం తిన్నారు. కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్కులో బోర్లు రీచార్జి కోసం ఇంకుడు గుంతలు తవ్విస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటికీ సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గతంలో రూ.260కోట్లతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. ఇది కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిప్పటికీ కొందరు వ్యక్తులు ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని ఫిర్యాదు చేశారన్నారు. వారికి నేషనల్‌ పార్కును అభివృద్ధి చేయడం ఇష్టం లేనట్టు ఉందని ఎమ్మెలే వ్యాఖ్యనించారు. త్వరలోనే ఈ పనులు ఎలా చేపట్టాలన్నది అధికారుతో కలసి నిర్ణయిస్తామని తెలిపారు.

రాజీవ్‌ కాలనీలో ఆకస్మిక పర్యటన

శనివారం ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే రాజీవ్‌ కాలనీలో ఆకస్మిక పర్యటన చేశారు. ఆధికారులు, సిబ్బంది, టీడీపీ స్థానిక నాయకులతో కలసి కాలనీ మొత్తం తిరిగారు. రోడ్లు, పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, తాగునీటి సరఫరా వంటి వాటి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం పలువురు కార్యకర్తల ఇళ్లకు వెళ్లారు. వారితో కాఫీ తాగుతూ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. కాటమయ్య అనే కార్యకర్తకు ఆర్థిక సహాయం చేశారు. ఎంపీడీవో దివాకర్‌, డిప్యూటీ ఎంపీడీవో వెంకటనాయుడు, టీడీపీ యూనిట్‌ ఇనచార్జి డిష్‌ నాగరాజు, టీడీపీ నాయకులు కనుమ చౌడయ్య, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:15 AM