అడుగంటిన భూగర్భ జలాలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:10 AM
మండలంలోని భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శెట్టూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండలంలోని కనుకూరు, అనుంపల్లి, బసంపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజనలో వ్యవసాయ బోరుబావుల కింద వేరుశనగ, టమోటా, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేశారు. గత ఖరీ్ఫలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో బోరుబావుల్లో జలాలు అడుగంటిపోయాయి. బోరు సుమారు 800 అడుగులు వరకు వేసినా ప్రయోజనం ఉండటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు చెరువులను నీటితో నింపి ఆదుకోవాలని కోరుతున్నారు.