పొదుపు సొమ్ము దుర్వినియోగంపై ఫిర్యాదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:12 AM
తాము బ్యాంక్లో చెల్లించమని ఇచ్చిన పొదుపు సంఘం డబ్బును యానిమేటర్, పొదుపు సంఘం లీడర్ కాజేశారని స్థానిక శాంతికాలనీకి చెందిన దీప్తి పొదుపు సంఘం మహిళలు వాపోయారు.
యాడికి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తాము బ్యాంక్లో చెల్లించమని ఇచ్చిన పొదుపు సంఘం డబ్బును యానిమేటర్, పొదుపు సంఘం లీడర్ కాజేశారని స్థానిక శాంతికాలనీకి చెందిన దీప్తి పొదుపు సంఘం మహిళలు వాపోయారు. ఈ మేరకు వారు స్థానిక పోలీ్సస్టేషనలో సోమవారం ఫిర్యాదు చేశారు. తమ సంఘంలో పది మంది ఉన్నామని, స్థానిక ఏడీసీసీ బ్యాంక్లో రూ.8లక్షలు రుణం తీసుకున్నామని, సభ్యులంతా నెలవారీగా చెల్లించాల్సిన పూర్తి సొమ్మును మా సంఘం యానిమేటర్, మొదటి లీడర్కు అందజేశామని తెలిపారు. ఆ డబ్బును వారు బ్యాంక్లో జమచేయకుండా దుర్వినియోగం చేశారని, బ్యాంక్కు వెళ్లి ఆరాతీయగా రూ.4.60 లక్షలు ఇంకా బాకీ ఉన్నట్లు చెబుతున్నారని వాపోయారు. వారి నుంచి తమ సొమ్మును రికవరీచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ను వివరణ కోరగా... దీప్తి సంఘం సభ్యులు చెల్లించిన సొమ్ము దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని, దీనిపై విచారణ చేసి.. సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని, సొమ్ము దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు.