Kashmir Turns White: కాశ్మీర్ లోయలో మంచు వర్షం.. వైరల్గా మారిన వీడియోలు..
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:41 AM
కాశ్మీర్ ప్రజలు గత రెండు నెలలుగా అత్యంత పొడి వాతావరణంతో నరకం చూస్తున్నారు. నీటి వనరులన్నీ గడ్డ కట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలో శీతాకాలం మొదలైన తర్వాత మొదటి సారి కాశ్మీర్ లోయలో మంచు వర్షం కురిసింది. ఎముకలు కొరికే పొడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట నిచ్చింది.
దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. చలి వాతావరణం ప్రజల్ని భయపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యల్పంగా 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సైతం నమోదు అవుతున్నాయి. ఇక, ఉత్తర భారత దేశంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పలు చోట్ల మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పొగ మంచు విపరీతంగా ఉంటోంది. ఉదయం 8 గంటల వరకు మనుషులు ఒకరికి ఒకరు కనిపించనంతగా పొగ మంచు నిండుకుపోతోంది. ఆగ్రాలోని తాజ్ మహల్ పొగ మంచులో పూర్తిగా కనిపించకుండా పోతోంది.
కాశ్మీర్ లోయలో మంచు వర్షం..
శీతాకాలం మొదలైన తర్వాత మొదటిసారి కాశ్మీర్ లోయలో మంచు వర్షం కురిసింది. ఎముకలు కొరికే పొడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట నిచ్చింది. గురెజ్ వాలీ, వార్వాన్ వాలీ, సింతాప్ టాప్, రజ్బాన్ పాస్, సాధనా టాప్, జోజిలా, సోన్మార్గ్లలో మంచు వర్షం కురిసింది. వీటితో పాటు ద్రాస్, కార్గిల్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో కూడా మంచు వర్షం కురిసింది. కాశ్మీర్ ప్రజలు గత రెండు నెలలుగా అత్యంత పొడి వాతావరణంతో నరకం చూస్తున్నారు. నీటి వనరులన్నీ గడ్డ కట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలో వర్షం కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు.
వారి అదృష్టం బాగుండి మంచు వర్షం కురిసింది. దీంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. పొడి వాతావరణ పరిస్థితి బాగా తగ్గింది. ఈ రోజు (ఆదివారం) జమ్మాకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో వర్ష ప్రభావం పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శీతాకాల పరిస్థితులపై శనివారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడాచ చదవండి
అండర్-19 వరల్డ్ కప్లో టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బ్యాటింగ్ ఎవరంటే?
పూజకు ఏ వస్తువులను తిరిగి ఉపయోగించకూడదో తెలుసా?