ISO Certification: ఎనర్జీ ఆడిట్లో తొలి ఆలయం గుట్ట
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:38 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు ఐఎ్సఓ సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి..
నాలుగు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పురస్కారాలు
పత్రాలు అందుకున్న దేవాదాయ అధికారులు
హైదరాబాద్, యాదగిరిగుట్ట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు ఐఎ్సఓ సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీఆడిట్ నిర్వహించిన మొట్ట మొదటి ఆలయంగా గుట్ట రికార్డు సొంతం చేసుకుంది. స్వామివారి అన్న, ప్రసాదాల్లో అత్యున్నత ప్రమాణాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సంతృప్తికరమైన దైవదర్శనం తదితర అంశాలకు ఈ నాలుగు అవార్డులు లభించాయి. గత రెండు నెలలుగా హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో ఐఎ్సఓ ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్, ఆడిట్ను గుట్టలో విజయవంతంగా నిర్వహించారు. కాగా ఈ ఐఎ్సఓ సర్టిఫికెట్లను సచివాలయంలో మంగళవారంఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, సీఎస్ రామకృష్ణా రావు సమక్షంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్ రావులకు అందచేశారు. కాగా, యాదగిరిగుట్ట ఆలయ ఖజానాకు 28 రోజుల్లో రూ.2.35 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం కొండకింద వ్రత మండపంలో లెక్కించారు.