Tender Process: టెండర్ ద్వారానే కందిపప్పు కొనుగోలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:58 AM
అంగన్వాడీ కేంద్రాలకు కంది పప్పు కొనుగోళ్లలో టెండర్ విధానాన్ని అనుసరించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాలకు కంది పప్పు కొనుగోళ్లలో టెండర్ విధానాన్ని అనుసరించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా తప్పనిసరిగా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తమ సూచనలు పాటించని జిల్లా అధికారులపై విచారణ జరుపుతామని తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కంది పప్పు కొనుగోళ్లకు కాంట్రాక్టర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయి.
టెండర్లు నిర్వహించకుండా రాష్ట్రంలో దాదాపు 15 జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘టెండర్ పెడితే రూ.118.. లేకుంటే రూ.164’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మహిళా శిశు సంక్షేమశాఖ రాష్ట్ర అధికారులు స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా టెండర్ లేకుండా అధిక ధరకు కట్టబెట్టిన కాంట్రాక్టులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.