Ganesh immersion: నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ని ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:15 AM
నిమజ్జనానికి వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎర్రవల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నిమజ్జనానికి వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటా క.. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇటిక్యాల ఎస్సై రవినాయక్ కథనం ప్రకారం.. ఇటిక్యాలలోని చెన్నకేశవ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జన కోసం ట్రాక్టర్లో బీచుపల్లి వద్ద గల కృష్ణానదికి తరలించారు. ట్రాక్టర్ జాతీయ రహదారిపై.. కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ సమీపానికి రాగానే.. వెనక నుంచి ఓ డీసీఎం వాహనం ఢీకొంది. ట్రాక్టర్ బోల్తాపడడంతో.. జమ్మన్న(50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన నర్సింహులు(48) ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. మరో ఎనిమిది మందికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ట్రాలీ చెరువులో పడి తండ్రీకొడుకు దుర్మరణం

దుండిగల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నిమజ్జనానికి వెళ్లిన తండ్రి, కుమారుడు ఆటోతో సహా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పొయారు. ఈ ఘటన దుండిగల్ పోలీ్సస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. దుండిగల్కు చెందిన శ్రీనివాస్(35) ఆదివారం సాయంత్రం తన ఆటోట్రాలీలో వినాయక విగ్రహాన్ని మోతీచెరువులో నిమజ్జనానికి తరలించారు. ఆయన తన కుమారుడు జాన్వెస్లీ(7)ని వెంట తీసుకెళ్లారు. నిమజ్జన తర్వాత.. చెరువుకట్టపై రివర్స్ తీసుకునే క్రమం లో ఆటోట్రాలీ చెరువులోకి దూసుకెళ్లింది. దాం తో.. శ్రీనివాస్, జాన్వెస్లీ నీట మునిగారు. చీకటవ్వడంతో ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. సోమవారం ఉదయానికి కూడా తండ్రీకొడుకులు ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలించి, ఆటోను గుర్తించారు. అందులోనే శ్రీనివాస్, జాన్వెస్లీ మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా.. చెరువు వద్ద నిమజ్జనం కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆకుల సతీశ్ ఆరోపించారు.