బతుకుదెరువుకు ఇదే ఆ‘దారం’
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:53 PM
దసలి పట్టు.. వారికి జీవనోధారం. తరతరాలుగా ఉపాధికి ఎంచుకున్న ఏకైక మార్గం. ప్రకృతితో మమేకమైన బతుకుదెరువు అది. లాభనష్టాలను బేరీజు వేసుకో కుండానే ఈ పరిశ్రమనే నమ్ముకొని కాలం వెళ్లదీస్తు న్నారు వారు. మహదేవపూర్ అటవీ ప్రాంతంలో దసలి పురుగులు పెంచడం, టస్సర్ కాలనీలో పట్టు వస్త్రాలను నేయడమే వారి పని.

దసలీపట్టు.. వారికి జీవనోపాధి
అష్టకష్టాలైనా అనాదిగా అదే పని
తాతలకాలం నుంచి మారని తలరాతలు
పట్టించుకోని ప్రభుత్వాలు
మహదేవపూర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : దసలి పట్టు.. వారికి జీవనోధారం. తరతరాలుగా ఉపాధికి ఎంచుకున్న ఏకైక మార్గం. ప్రకృతితో మమేకమైన బతుకుదెరువు అది. లాభనష్టాలను బేరీజు వేసుకో కుండానే ఈ పరిశ్రమనే నమ్ముకొని కాలం వెళ్లదీస్తు న్నారు వారు. మహదేవపూర్ అటవీ ప్రాంతంలో దసలి పురుగులు పెంచడం, టస్సర్ కాలనీలో పట్టు వస్త్రాలను నేయడమే వారి పని. తాతాముత్తాతల కాలం నుంచి ఇదే జీవనాధారమైనా వారి తలరాతలు మాత్రం మారలేదు. ఖరీదైన వస్త్రాలు తయారు చేసే ఈ కార్మికులకు జీవితాలు అనాదిగా దుర్భరంగానే సాగుతున్నాయి.
పట్టు పరిశ్రమ ప్రసిద్ధి మహాదేవపూర్. ఇక్కడ అనేక కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవి స్తున్నారు. వీరికి ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వం ద్వారా దసలి గడ్లు మాత్రమే సరఫరా అవుతాయి. పట్టు పురుగులు బయటకు రాగానే అటవీ ప్రాంతంలోని మద్ది చెట్లపై వారు విడిచిపెడుతారు. మేత కాలంలో చీమలు, కీటకాలు, పక్షులు, కోతులు, విష పురుగుల నుంచి వాటిని రక్షించుకుంటారు. ఈ క్రమంలో పట్టు పురుగులు ఆ చెట్లపై గూళ్లను ఏర్పరచుకుంటాయి. పురుగులను నిర్జీవం చేసి కార్మికులు వాటి ద్వారా పట్టు దారం తీస్తారు. దీంతో మగ్గంపై వస్త్రాలు నేస్తారు. విభిన్న రంగులను అద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు.
పట్టు వస్ర్తాలకు మహా క్రేజ్
మహదేవపూర్ దసలి పట్టు వస్త్రాలు అంటేనే ఓ ప్రత్యేక ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పూజా క్రతువు లకు, దేవతామూర్తులకు సమర్పించేందుకు ఈ వస్త్రాలను వినియోగిస్తారు. ఈ రంగంలో ఇప్పటికే చాలా మంది ఉండగా నేటి తరం యువత కూడా మక్కువ చూపుతున్నారు. కష్టం ఎక్కువ ఉండి, లాభం తక్కువ ఉన్నా మరో ఉపాధి లేక ఈ పరిశ్రమనే నమ్ముకుంటున్నారు.
ప్రభుత్వ సహకారం లేక..
మహదేవపూర్లో అటవీ ప్రాంతంలో పట్టు పురు గుల పెంపకంలో సుమారు 190 కుటుంబాలు ఆధార పడ్డాయి. దసలి పట్టు వస్త్రాల తయారీలో టస్సర్కాలనీలో 84 కుటుంబాలు జీవనోపాధి పొం దుతున్నాయి. పట్టు పురుగుల పంపెకంలో సుమా రు 30 మంది. దసలి పట్టు వస్త్రాల తయారీలో 20 మంది వరకు పని చేస్తున్నారు. వీరికి ప్రభభత్వ పరంగా రాయితీ, ప్రోత్సాహకం, చేయూత అందిండంలేదు. అటవీ ప్రాంతంలో రాత్రీ పగలూ విషపు కీటకాలు, పురుగులు, పాములతో కుస్తీపడుతున్నా, ప్రాణాలకు సైతం హానీ జరిగే అవకాశాలు ఉన్నా స్పందన కరువైంది. ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవడం లేదు.
బీమా సౌకర్యం కల్పించాలి: బిల్లా భాస్కర్, దసలి పట్టు పురుగు పెంపకందారుడు
అటవీ ప్రాంతంలో చలి, వర్షంలో రాత్రి, పగలు అని తేడా లేకుండా పట్టు పురుగులను కాపాడుతూ అడవిలోనే ఉంటున్నాం. పట్టు పురుగుల పంటలు రావాలంటే కత్తిమీద సాము లాంటింది. అడవిలో జంతువులు, విష పురుగులు, కీటకాలతో ప్రమాదాలు జరిగినప్పుడు భీమా సౌకర్యం, మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా ప్రభుత్వం చొరవచూపాలి.
కొత్త యంత్రాలు అందించాలి : రెబ్బ సతీష్, పట్టు వస్త్ర కార్మికుడు
దసలి పట్టు వస్ర్తాల కోసం మగ్గం నేయడం చాలా ఇబ్బంది, కష్టత రమవుతోంది. సాంకేతికంగా ఈ పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేసి కొత్త యంత్రాలు అందించి మాలాంటి వారికి ఉపాధిని మెరుగుపర్చాలి.