డయాలసిస్ రోగులకు ‘చే’యూత
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:17 AM
డయాలసిస్ రోగుల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒక్క నెలలోనే 4021 మందికి రూ.2,016 పెన్షన్ మంజూరు
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): డయాలసిస్ రోగుల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా మొత్తం 4021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో కేవలం 4011 మంది డయాలసిస్ రోగులకే ఆసరా పింఛన్ అందితే.. తాజాగా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక్క నెలలోనే అంతకు మించి లబ్ధిదారులను ఎంపిక చేయడం గమనార్హం.
పెన్షన్ కోసం డయాలసిస్ రోగుల్లో లబ్ధిదారుల ఎంపికలో మంత్రి సీతక్క చొరవ చూపారు. డయాలసిస్ రోగుల కష్టాలను గుర్తించిన సర్కారు.. పెన్షన్ మంజూరు చేసింది. పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.993కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు, సుమారు 13 వేల మంది హెచ్ఐవీ రోగులు తమకూ పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే మరింత మందికి పెన్షన్లు మంజూరు కావడంతోపాటు ఆ పద్దు పెరిగే అవకాశముంది.