జూలై తొలి వారంలో హ్యామ్ రోడ్లకు టెండర్లు!
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:42 AM
హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో నిర్మించతలపెట్టిన రహదారుల పనులకు జూలై మొదటివారంలో టెండర్లను ఆహ్వానించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
5,190 కిలో మీటర్లు.. 50కి పైగా ప్యాకేజీలు
త్వరలో కాంట్రాక్టర్లతో ఆర్అండ్బీ సమావేశం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో నిర్మించతలపెట్టిన రహదారుల పనులకు జూలై మొదటివారంలో టెండర్లను ఆహ్వానించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశలో అభివృద్ధి చేయాలని గుర్తించిన 5,190 కిలోమీటర్లను 50కిపైగా ప్యాకేజీలుగా విభజించారు. పనుల నిర్వహణ, టెండర్ల వ్యవహారానికి సంబంధించి త్వరలోనే రాష్ట్రంలోని కాంట్రాక్టర్లతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఆ సమావేశంలో కాంట్రాక్టర్లు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్యాకేజీలను పెంచాలా? తగ్గించాలా? అనేది ఖరారు చేయనున్నారు. కాగా, మొదటి దశలో 5,190 కిలో మీటర్ల హ్యామ్ రోడ్ల కోసం రూ.16,414కోట్ల మేర వ్యయం కానుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లతో అనుసంధానం, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు నాలుగు లైన్ల రహదారులను నిర్మించనున్న విషయం తెలిసిందే.