ఎస్ఆర్బీసీ నీటి కేటాయింపులను సమీక్షించాలి
ABN , Publish Date - May 17 , 2025 | 03:37 AM
శ్రీశైలం రైట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఆర్బీసీ)కి నీటి కేటాయింపులను బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ఆధారంగా సమీక్షించాలని కృష్ణా ట్రైబ్యునల్-2ను తెలంగాణ కోరింది.
కృష్ణా ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదన
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రైట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఆర్బీసీ)కి నీటి కేటాయింపులను బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ఆధారంగా సమీక్షించాలని కృష్ణా ట్రైబ్యునల్-2ను తెలంగాణ కోరింది. తెలంగాణలో పలు ప్రాజెక్టుల కింద ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’ జాతీయ పాలసీ ఆధారంగా ఒక టీఎంసీ నీటితో 12,800 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే విధానాన్ని అనుసరిస్తుండగా... ఏపీలో ప్రాజెక్టుల కింద మాత్రం ఒక టీఎంసీ నీటితో 8400 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయని, వీటిని సరిచేసి, ఏపీలో పొదుపు చేసే నీటిని తమ ప్రాజెక్టులకు కేటాయించాలని అభ్యర్థించింది. శుక్రవారం న్యూఢిల్లీలోని జస్టిస్ బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా ట్రైబ్యునల్-2) ముందు తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తమ వాదనలు వినిపించారు.
తెలంగాణలో లోటు వర్షపాతంతో అరు తడి పంటలు మాత్రమే సాగుచేస్తున్నారని, కృష్ణా బేసిన్లో నికర జలాలతో 15 శాతం మాత్రమే సాగు ప్రాంతం ఉండగా... అదే ఏపీలో 95 శాతం సాగు ప్రాంతానికి నీరు అందుతుందని నివేదించారు. ఉమ్మడి ఏపీలో మిగిలిన కృష్ణా జలాలను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్సఎల్బీసీ)కి కేటాయించాల్సి ఉండగా... ఎస్ఆర్బీసీకి మళ్లించారని నివేదించారు. అందువల్లే ఎస్ఆర్బీసీకి కేటాయించిన నీటిని బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ఆధారంగా సమీక్షించాలని కోరారు. శుక్రవారంతో తెలంగాణ ఈ దఫా వాదనలు పూర్తయ్యాయి. దాంతో జస్టిస్ బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్ విచారణ జూలై 23వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణ తదుపరి వాదనలు జూలై 23-25 తేదీల్లో వినిపించనుంది.