Thummala Nageswara Rao: ప్రపంచానికే తలమానికంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:17 AM
రాష్ట్రంలోని మనోహ్మన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
అధికారులతో మంత్రి తుమ్మల .. నిర్మాణ ప్లాన్ పరిశీలన
హైదరాబాద్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మనోహ్మన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మించ తలపెట్టిన ఈ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్ ఉష రూపొందించిన ప్లాన్ను వర్సిటీ వీసీ యోగితా రాణాతో కలిసి మంత్రి తుమ్మల సచివాలయంలో శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. 300 ఎకరాల్లో చేపట్టబోయే వర్సిటీ నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ ఉండకూడదని, ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలు ఉండేలా నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్ రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించి ఆమోదం పొందాలని సూచించారు. ఆ వెంటనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. మూడేళ్లలో యూనివర్సిటీ పనులు పూర్తవ్వాలని అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.