Bhatti Vikramarka: సీఎస్ఆర్ నిధుల వ్యయానికి తెలంగాణే సరైన వేదిక
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:03 AM
కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) నిధులను ఖర్చు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్త కార్పొరేట్ సంస్థలు తరలిరావాలి
ఇక్కడ మీరనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి
‘అసోచామ్’ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) నిధులను ఖర్చు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు తమ సీఎ్సఆర్ నిధులను తెలంగాణలో ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని మైండ్స్పే్సలో గల ‘ది వెస్టిన్’ హోటల్లో ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సదరన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ‘సీఎ్సఆర్ అండ్ సస్టెయినబిలిటీ’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం.. ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యతలతో కూడిన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సాగుతోందన్నారు. ప్రస్తుతం అపార వనరులున్నా.. అసమానతలతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు తమ సంస్థల నిర్మాణం కోసం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని ఆకాక్షించారు. ‘కార్పొరేట్ సంస్థలు సీఎ్సఆర్ నిధులను ఖర్చు చేయడానికి రాష్ట్రం సరైన వేదిక. ఇక్కడ మీరనుకున్న లక్ష్యాలు నూటికి నూరు శాతం నెరవేరుతాయి. ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేయడానికి అవకాశముంది.
మానవీయ కోణాన్ని జోడిస్తూ రాష్ట్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతం. ఇక్కడ అనుకూలమైన వాతావరణముంది. అన్నింటికీ మించి స్నేహపూరిత ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది. హెల్త్, ఫార్మా, ఐటీ, ఆహార ధాన్యాల వంటి రంగాల్లో తెలంగాణది తిరుగులేని ప్రస్థానం’ అని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని.. మొదటి దశలో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున 100 పాఠశాలలను మంజూరు చేశామని తెలిపారు. ఈ స్కూళ్ల నిర్వహణా బాధ్యతలను చేపడతామంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. గతంలో నిర్మించిన 100 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల లాభాలు కేవలం ఆ సంస్థలకే పరిమితం కాకూడదని, కొంత మేర లాభాలు ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు, ఇబ్బందుల్లో ఉన్న రైతులకు, గ్రామీణ కళాకారులకు చేరాలని ఆకాంక్షించారు.